జగన్ సమీక్ష ఐటీ శాఖ దుస్థితిని తెలియజేస్తోంది: నారా లోకేశ్

  • ఐటీ శాఖ పరిస్థితి విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి అన్నట్టుగా తయారయింది
  • సలహాదారులు పెరుగుతున్నా.. రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు శూన్యం
  • సలహాదారుల గుంపు టీ, కాఫీలు తాగుతూ గడిపేస్తున్నాయి
ఏపీకి కొత్త ఐటీ కంపెనీలు రాకపోగా... ఉన్న కంపెనీలన్నీ బైబై జగన్ అంటున్నాయని టీడీపీ నేత నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఐటీ శాఖపై జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి సంబంధించిన ఫొటోలు ఆ శాఖ దుస్థితిని తెలియజేస్తున్నాయని చెప్పారు.

ఆఖరికి ఐటీ శాఖ పరిస్థితి విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి అన్నట్టుగా తయారయిందని అన్నారు. డజన్ల కొద్దీ సలహాదారుల్ని పెంచుకుంటూ పోతున్నా రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. కనీసం రివ్యూ మీటింగ్ కి హాజరైన సలహాదారులన్ని కంపెనీలు కూడా ఈ రెండేళ్ల విధ్వంస పాలనలో రాష్ట్రానికి రాలేదని నారా లోకేశ్ విమర్శించారు.

టీడీపీ హయాంలో వచ్చిన కంపెనీలు మా శ్రమ ఫలితమే అని బిల్డప్ ఇచ్చే పనిలో ఐటీ శాఖ మంత్రిగారు బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు. కంపెనీలు తీసుకురావడం చేతకాని సలహాదారుల గుంపు... టీ, కాఫీలు తాగుతూ కాలం గడిపేస్తున్నాయని ఎద్దేవా చేశారు. సలహాదారుల్లో కొంతమందికి ఇతర రాష్ట్రాల్లో ఐటీ కంపెనీలు ఉన్నా... జగన్ రెడ్డి ముఖం చూసి రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం కొసమెరుపని అన్నారు.

Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
IT Sector

More Telugu News